Monday, February 18, 2008

బీహార్ రైల్వే రాజకీయం

ఉత్తర భారత దేశీయులు స్థానికులకు రావలసిన అవకాశాలు చేజిక్కించుకుంటున్నారని నిరసించటం, ఈసారి కన్నడిగుల వంతయ్యింది. ముంబైలో నార్త్ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైందని రాజ్ థాకరే గొడవ మొదలెట్టిన వారంలోనే కర్నాటక రైల్వేలో గ్రూప్ 'D' పోస్టుల భర్తీని కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. ఈ రెక్రూట్‍మెంట్లు కన్నడిగులకు రావలసిన ఉద్యోగాలు బీహారీలకు కట్టబెట్టటానికే జరుగుతున్నాయని వారి అభియోగం.

క్రితం నెలలో సౌత్ వెస్ట్ రైల్వేలో గ్రూప్ 'D' పోస్టుల కోసం నిర్వహించిన ఫిజికల్ పరీక్షలను, 'కర్నాటక రక్షణ వేదిక' జరగకుండా అడ్డుకుంది. పోయిన వారం చిత్రదుర్గలో సమావేశానికి వచ్చిన లాలూ ప్రశాద్ యాదవ్ ముందు ఈ వేదిక నల్ల జెండాలతో తన నిరసన వ్యక్తం చేసింది. దానికి లాలూ జవాబిస్తూ అందరితో పాటూ మెరిట్‍లో ఆ పొస్టులు దక్కించుకోవాలని, స్థానికులకు రిజర్వేషనులు కుదరదని చెప్పారు. దాదాపు కర్నాటకలోనే రైళ్ళు నడిపే సౌత్-వెస్ట్ రైల్వేలో పోస్టులకు, కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ వార్తా పత్రికల్లో మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. స్థానిక కన్నడ పత్రికలలో ఈ ప్రకటన రాలేదు. ఇక స్థానికులు మెరిట్‍లో తెచ్చుకోవటం ఎలాగో నాకు అర్ధం కావట్లేదు. అసలు సమానంగా అవకాశం కల్పిస్తే కదా మెరిట్‍తో తెచ్చుకోవటమూ, లేకపోవటమూ. ఈసారి ఈ పరీక్షకు హాజరైన వాళ్ళలో స్థానిక కన్నడిగులు 10 శాతం కంటే తక్కువ. వచ్చిన వారిలో బీహారీలే అత్యధికం. కర్నాటకలో రైల్వే పోస్టులు భర్తీ చెయ్యటం కోసం ఎక్కడో బీహార్ నుంచి బెంగుళూరు, మైసూరు, హుబ్లీలకు రైళ్ళలో అభ్యర్ధుల్ని దింపారు. ఇప్పటికే హుబ్లీలాంటి చోట 80 శాతం రైల్వే ఉద్యోగాలలో బీహారీలే వున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ పోస్టులకు ఎంపిక చేయబడుతున్న వారిలో బీహారీలే అత్యధిక శాతం. మరి స్థానికులకు కడుపు మండకుండా ఎలా వుంటుంది. ఈ గ్రూప్ 'డి' పోస్టులకు( పోర్టర్లు, లైన్‍మెన్ మొదలైనవి) అర్హత కేవలం 8వ తరగతి చదివి వుండటం. వీటిని మెరిట్‍లో దక్కించుకునే పాటి తెలివితేటలు కూడా ఇక్కడి స్థానికులకు లేవని నేను అనుకోను.

కర్నాటకే కాదు, ఆంధ్రాలోనూ రైల్వేలో ఎక్కడ పడితే అక్కడ ఈ బీహారీలే వుంటారు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వుంటే అక్కడికి హిందీ మాట్లాడే జనాలు పెద్ద సంఖ్యలో దిగబడిపోతారు. ఇక బీహారీలకైతే అవకాశాలున్న చోటికి ప్రత్యేక రైళ్ళు నడపబడుతాయి. ఈ హిందీ వాళ్ళ ఆటలు దక్షిణాది రాష్ట్రాల్లో (తమిళనాడు మినహాయించి) సాగినంతగా మిగతా రాష్ట్రాల్లో సాగవేమో. ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికైనా మిగతా రాష్టాల వారు పరీక్షకి కూర్చోలేరు. పరీక్ష రోజు రైలు దిగీ దిగగానే, కొట్టి మరీ అదే రైల్లో వెనక్కి పంపిస్తారు కళింగసేన కార్యకర్తలు. మళ్ళీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిండా వీళ్ళే వుంటారు. రాజ్యాంగం భారతీయిలందరికి దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకునే హక్కుని ప్రసాదించిందని గొంతు చించుకునే జాతీయవాదులెవరైనా ఒక్కసారి ఒరిస్సాలోనో, బీహార్లోనో ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది. వాళ్ళ భ్రమలు రైల్వే స్టేషన్‍లోనే తొలగిపోతాయి.

కర్నాటకలో భర్తీ చేసే గ్రూప్ 'డి' పోస్టులాంటి క్రింది స్థాయి ఉద్యోగాలను, కన్నడిగులకు రిజర్వ్ చేయాలని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. కన్నడిగుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే ఈ వేదిక ఇతర డిమాండ్ల గూర్చి నాకు పూర్తిగా తెలీదు కాని, ఇది మాత్రం నాకు సమంజసంగానే అనిపిస్తోంది. పెద్ద పోస్టులకు ఎక్కువ అర్హతలు వుండాలి కాని, గ్రూప్ 'డి' పోస్టుల్లో పని చేసే వారికి ఇంగ్లీష్/హిందీ రావలసిన అవసరం ఏముంది?

రైల్వే ఏదో లాలూ గుత్త సొతైనట్లు బీహారీలకే ఉద్యోగాలిస్తుంటే, ఏమని అడిగే దమ్ము లేదు మన దిక్కుమాలిన పాలకులకు. కర్నాటకలో పాలకులు ఎలా వున్నా, తమ భాష వారికి అన్యాయం జరిగితే నిలదీయటానికి ఒక వేదికైనా వుంది. మనకు అదీ లేదు.