Saturday, November 8, 2008

రచ్చ గెలిచాం, ఇంట గెలిచేది ఎన్నడో?

ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు భాషాభిమానులు పోరాడిన తర్వాత తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రకటించింది. 2004లో తమిళులు తమ భాషకి ప్రాచీన భాషంటూ ఒక హోదా కట్టబెట్టేవరకు, మనకు కనీసం ఆ ఆలోచన కూడా లేదు. వాళ్ళకివ్వగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి స్లోగన్లివ్వటం మొదలుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం మనల్ని గుర్తించట్లేదని, అరవ మంత్రులు అడ్డుపడుతున్నారని, మన నాయకులు పట్టించుకోవట్లేదని వాపోయాం. ఇన్నాళ్ళూ కదలకుండా ఉన్న కేంద్రం హఠాత్తుగా ఎన్నికల సంవత్సరంలో కదిలింది. మన నాయకులేమో కోర్ట్ లో కేసున్నా పర్లేదంటూ, రాష్ట్రావతరణ దినోత్సవం రోజున ప్రకటన ఇప్పించేసి, మా పని మేం చేసేసాం, మమ్మల్నింక తప్పు పట్టటానికి ఏమీ లేదని చేతులు దులిపేసుకున్నారు. ఈ హోదా వల్ల మనకేం ఉపయోగం, తెలుగు ప్రాచీన భాషైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి, నవీన భాష కావాలి కానీ, అని చాలా మంది పెదవి విరిచారు. ఈ వాదనల్లో నిజమున్నా, ప్రాచీన భాష హోదా కోసం చేసిన పోరాటం మరీ అంత అనవసరమైనది కాదని నా అభిప్రాయం. తెలుగుకేదో కొత్త గుర్తింపని కాదుగాని, ఈ ప్రయత్నం తెలుగు భాషాభిమానుల్లో కావలసినంత కదలిక తీసుకువచ్చింది. ఈ నాలుగు సంవత్సరాలూ భాషని గురించిన చర్చలు, వాదాలు ఎడాపెడా చేసాం, విన్నాం. భాష విషయంలో మనది కొంచెం తోలుమందం కాబట్టి, పొరుగువారు వచ్చి వీపు మీద చరిచాక గాని తేరుకోలేదు. మన వాళ్ళకు పోటీ, పోలిక ఉంటే తప్ప సొంత భాషైనా రుచించదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన హోదా తెలుగు భాషకు వచ్చిన గుర్తింపు అనటం కంటే, భాషాభిమానుల్లో పెరిగిన స్ఫూర్తికి గుర్తు అనుకోవచ్చేమో. తెలుగువాళ్ళం చాలా అరుదుగా, అదీ తప్పు చేస్తున్నట్టు సిగ్గుపడుతూ చూపించే మన భాషాభిమానాన్ని నిర్భయంగా అందరికీ ప్రదర్శించటానికి వచ్చిన ఒక సందర్భంగా అనుకోవచ్చు.

ఢిల్లీకెక్కి రచ్చ చేసి రచ్చ గెలిచాం గానీ ఇంట గెలిచే సూచనలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాం గానీ, తెలుగువారితో వారి మాతృభాష గొప్పదని, మిగతా ఏ భాషలకూ తీసిపోదని అనిపించలేకున్నాం. మన రాష్ట్రంలో భాషాభిమానులంటే గ్రహాంతరవాసుల క్రింద లెక్క. మనదైన దాన్ని అభిమానించమని ఎవ్వరూ చెవినిల్లు కట్టుకుని పోరాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు విషయంలో చెప్పాల్సి వస్తోందంటే కారణం, అది ఈ రోజు తెలుగువారికి పరాయిదైపోవటమే. భాషా, అది నేర్పే సంస్కృతీ, మనలో భాగమైనప్పుడు భాషాభిమానం సహజంగా వస్తుంది. చిన్నప్పట్నుంచీ తల్లి ఒడిలో గోరుముద్దలు తింటూ పెరిగిన పిల్లవాడు తల్లిని సహజంగా, unconditionalగా ప్రేమిస్తాడు కానీ, అదేదో భాధ్యతలానో, పక్కవారి కోసమో ప్రేమించడు. చిన్నప్పుడు చందమామ పుస్తకం ఊహల్లో విహరింపజేస్తుంటే, ఎప్పటికప్పుడు వేమన నీతులు జాగ్రత్తలు చెబుతూ ఉంటే, ఎంకి పాటలు సేదతీరుస్తుంటే, వాగ్గేయకారుల కీర్తనలు నవరసాలు ఒలికిస్తూ మురిపిస్తుంటే, ఇవి అనుభవించిన వారెవరైనా తెలుగెందుకని అడుగుతారా? దాని వల్ల ఉపయోగాలు ఏమీ లేవని ఎన్ని చెప్పినా ఒదులుకుంటారా? తమ పిల్లలకి నేర్పకుండా ఉంటారా? భాష జీవితంలో విడదీయరాని భాగమై పెనవేసుకుపోవాలి. అలా కానప్పుడు అది కేవలం మాట్లాడటానికి ఉపయోగించే ఒక మీడియం అవుతుంది, అంతే. చిన్నతనంలో సరిగ్గా పరిచయం చేస్తే, జీవితాంతం మనల్ని మురిపించి మైమరిపించగల శక్తి తెలుగు భాషకి ఉంది. కానీ అసలు ఇప్పటి పిల్లల కలలోకైనా మనం తెలుగుని రానివ్వటం లేదు. ఇంకది వారిని ఎలా మురిపిస్తుంది, ఎలా వారి జీవితంలో భాగమౌతుంది. భాషైనా, సంస్కృతైనా, మరే భావనైనా, మనలో లేకుండా మన చుట్టూ జీవితంలో ఉంటే దాన్ని మనం అభిమానించకపోగా, చిరాకు పడతాం. ఎందుకంటే అది మనకొక అనవసరపు బరువులా, మనకు ఉపయోగపడని ఒక బాధ్యతలా పరిణమిస్తుంది. మనలో భాగం కానిదేదైనా ఒక అదనపు లగేజ్. చిన్నతనంలో తెలుగులోని తియ్యదనాన్ని రుచి చూసినవారు, పెద్దయ్యాక ఎన్ని భాషలు నేర్చినా, అది బ్రతకటానికి పనికి రాకపోయినా దాని పై అభిమానం పోగొట్టుకోరు. ఇప్పుడు మనం చేయవలసినవి, మారుతున్న పరిస్థితులకు సరిపోయే విధంగా భాషను పరిపుష్టం చేసుకోవటమూ, మన పిల్లలకు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికీ, దానితో మాట్లాడటానికీ, తియ్యనైన మన భాషను అందించటమూ.

మన తెలుగు భాష గొప్పదని, చరిత్ర గలదని చెప్పుకుంటాం. కన్నడరాయని ప్రశంసల్ని, సుబ్రమణ్యభారతి పొగడ్తల్ని, తెలుగుతల్లి మెడలో దండలుగా వేసి మురిసిపోతాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మరో దండ వేయించాం. ఆమె పాదాల దగ్గర ప్రణమిల్లే భక్తి ప్రపత్తులు లేకుండా కేవలం దండలతోనూ, వంక దండాలతోనూ, సరిపెట్టటం చిత్తసుద్ధి లేని శివపూజ లాంటిది. ఎన్నాళ్ళని పోయిన శతాబ్దపు పాచిపోయిన గొప్పలు చెప్పుకుంటాం. మన భాషకు కొత్త హంగులు దిద్దాల్సిన సమయం వచ్చింది.


Sunday, October 5, 2008

హిందూ తీవ్రవాదం

ఇన్నాళ్ళూ మనకు తీవ్రవాదం అంటే ఇస్లామిక్ తీవ్రవాదమే గుర్తొచ్చేది. ఇప్పుడు కొత్తగా హిందూ తీవ్రవాదం మొదలయ్యింది. గుజరాత్ మారణకాండలోను, ఒరిస్సా మతఘర్షనల్లోను వీరు తమ ఉనికిని బలంగా చాటుకున్నారు. ఇవి చెదురుమదురు సంఘటనలే అనుకోటానికి లేదు. ఈ దాడులు గమనిస్తే ఇవి పక్కా ప్రణాళిక ప్రకారం చేసినవని తెలుస్తుంది. ఇంత ప్రణాళికాబద్దంగా జరిగే హింసని తీవ్రవాదమనే అనాలి. దీన్నీ మిగతా మత తీవ్రవాదాలతో సమానంగా పరిగణించి ఖండించాలి అనటంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు. కానీ అసలు గొడవ ఎక్కడ మొదలౌతుందంటే, ఈ దాడుల్ని తీవ్రవాదంగా భావించి ఖండించే మేధావులు, మిగతా మతాలు చేస్తున్న హింసకి మాత్రం కారణాలు వెతుక్కుని, వారి ఆవేశాన్ని సానుభూతితో పరిశీలించాలని చెప్పటం దగ్గర. మాటకు పదిసార్లు లౌకికత్వం గురించి మాట్లాడే మన ప్రభుత్వము, మన మేధావి వర్గము, నిజంగా అలాగే ప్రవర్తించుంటే ఈ కొత్త తీవ్రవాదం పుట్టక పోయుండేదని నా నమ్మకం.

ఎలాంటి తీవ్రవాదులకైనా జనాల సహకారం ఎంతో కొంత లేకుండా కార్యకలాపాలు చెయ్యటం కష్టం. నేను, ఈమధ్య వరకు కూడా హిందూ ఓటు బ్యాంకు, హిందూ తీవ్రవాదం అనేవి సాధ్యం కావని అనుకునేవాడిని. ఎందుకంటే ఇవి రెండూ కుదరాలంటే ఆ మతం చాలా వ్యవస్థీకృతమైనదిగా వుండాలి. హిందూ మతం శతాబ్దాలుగా ఎన్నో విభిన్న శాఖలుగా చీలి, ఎన్నో కొత్త భావాల్ని కలుపుకుని, ఎన్నో పరస్పర విరుద్దమైన విషయాలను తనలోకి ఇముడ్చుకుని, ఒక జీవన విధానంగా అవతరించింది. అది ఒక మతానికుండే నిర్మాణాన్ని(structure) ఎప్పుడో పోగొట్టుకుంది. నిజానికి దాన్ని ఒక మతమనటమే తప్పు. మతం ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించలేదు. ఇంత చిందరవందరగా ఎవరికి వారుగా బ్రతికే గుంపులోంచి చాలా ఆర్గనైజ్డ్‍గా, నిర్ధిష్టమైన లక్ష్యం కోసం పని చేసే తీవ్రవాదం పుట్టడము, నిలదొక్కుకోవటమూ కష్టం. కానీ ఇప్పుడు మొదలయ్యింది. అందుకు నాకు తోచిన కారణాలు ఇవి.

ఈ దేశంలో మిగతా మతాలతో పోలిస్తే హిందువుల్లో తమ మతం గురించిన పట్టింపులు మొదట్నుంచి తక్కువ, పరమత సహనం ఎక్కువ. కానీ ఈ మధ్య కాలంలో సామాన్య హిందువుల్లో కూడా మతాభిమానము, మనమంతా హిందువులం అనే భావనా పెరిగింది. విభిన్న కులాలుగా, విభిన్న ఆచారాలతో బ్రతుకుతున్న వీరిని గుంపుగా చేరుస్తున్నదేమిటో గమనిస్తే అది వారి మతమూ, ఫిలాసఫీ కంటే, పక్క మతాల పై పెరుగుతున్న నిరసన, కోపం ఎక్కువగా కనిపిస్తుంది. హిందువులుగా చెప్పబడుతున్న ఈ వైవిధ్యమైన గుంపు ఎప్పుడూ proactiveగా ఒక్కటవ్వలేరు, కేవలం reactiveగానే ఒక్కటిగా కలవగలరు. మిగతా మతాల వారిలా proactiveగా కలిసుండటానికి వీరికి కారణాలు బహుతక్కువ. ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఐకమత్యం కూడా అలా ప్రతిక్రియ(reactive)‍గా వచ్చిందే. అందుకు కారణం, తమ దేశంలోనే తమ మత విశ్వాసాలకి అడుగడుగునా సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వారు భావించటం. అది నిజమేనని నిరూపించి, వారిలో మరింత అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్న బాంబు దాడులు, క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సాంస్కృతిక దాడులు, వారిని వెనకేసుకొస్తున్న ప్రభుత్వము, మరియు మేధావి వర్గము.

ఒక పక్క వారంవారం ఠంచనుగా బాంబులు పేలి జనం చస్తుంటే, వాళ్ళవాళ్ళని మన పోలీసులు వేధిస్తున్నారంట, అందుకే కడుపు మండి పేలుస్తున్నారు పాపం, అని సమర్ధించేవారు కొందరు. మన మతాన్ని, విశ్వాసాల్ని కించపరుస్తున్నారు అంటే, మతప్రచారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, పక్క మతాల్ని తప్పుపట్టకుండా మతప్రచారం ఎలా చేసుకుంటారు పాపం,  మనమే సర్దుకోవాలి అని వెనకేసుకొచ్చేవారు ఇంకొందరు. తప్పు ఎవరు చెసినా ఒకటే, అని ఖండిస్తే చల్లారిపోయే దానికి, మనం చెయ్యలేదా, మనలో లేదా అని ఎదురుదాడికి దిగి మరింత నిప్పు రాజేస్తారే కానీ, వారికి అవి తప్పుగా కనిపించవు. ఈ మేధావి వర్గం రెండు వైపులా ఖండించటం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఏకపక్ష ఖండనే. హైందవేతరుల తప్పుల్ని ఖండించాల్సొచ్చినప్పుడు కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడరు. ఈ రకంగా మైనారటీలను చంకనేసుకుని గారాభం చేసే వాళ్ళున్నంత కాలం ఈ సమస్య పరిష్కారం అవ్వదు.

హిందువుల్లో ఈ అతివాద గ్రూపులు ఎప్పట్నుంచో వున్నాయి కానీ ఇన్ని రోజులు వాటికి సామాన్య జనాల సపోర్టు, సానుభూతి లేదు. పైగా వ్యతిరేకత వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అసలు బీజేపీకి దక్షిణ భారతదేశంలో అడుగు పెట్టటం సాధ్యమవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ జరిగింది. ఈ అతివాద గుంపులను ఇన్ని రోజులు అడ్డుకున్నది, వ్యతిరేకించినది కూడా మితవాద హిందువులే. ఇప్పుడు వారే పక్కకి తప్పుకుని అతివాదులకు దారి వదిలేస్తున్నారు. తమ మతం పై జరుగుతున్న సాంస్కృతిక, భౌతిక దాడుల పట్ల వారి అసంతృప్తి, అతివాదులకు ఇంధనంగా మారుతోంది. ఏ మతంలో ఐనా తీవ్రవాదులు తమ చర్యలకు ఏదో ఒక కారణాలు చూపిస్తూనే వుంటారు. వీరికి సామాన్యుల నుంచి సానుభూతి దొరకటం ప్రమాదకరమైన విషయం. నిన్న మొన్నటి వరకు హిందూ అతివాదుల చర్యలకు చిరాకుపడ్డ హిందువులు కూడా, ఇప్పుడు "అలాంటి అతిగాళ్ళకు పోటీగా, ఇలాంటి అతిగాళ్ళు వుండాల్లే, లేకపోతే ఇంకా రెచ్చిపోతారు" అనటమే, వారికి సానుభూతి పెరుగుతోందనటానికి సాక్ష్యం. తమకు పెరుగుతున్న సపోర్ట్ గమనించే, వారు కూడా ఇష్టానుసారం భారీ దాడులకు దిగుతున్నారు.

ఇన్ని రోజులు ఈ దేశం లౌకికదేశంగా వుందంటే, దానికి కారణం ఇక్కడి మెజారిటీ మతంలోనే లౌకికత్వం వుండటమేగాని, అదేదో రాజ్యాంగంలో ప్రకటించేస్తే వచ్చింది కాదు. అలాంటి హిందూ మతమే ఇవాళ తన విశాలత్వాన్నీ, విభిన్నత్వాన్నీ స్వచ్చందంగా వదులుకుని, బలం కోసం ఒక సంకుచిత మూసలోకి ఒదుగుతోంది. ఇన్నాళ్ళు హిందూ మతంగా భావిస్తున్నది నిజానికి మతం కాదు, కాని కొత్తగా ఇప్పుడు పుడుతోంది. తన విశాలత్వానికి మేధావుల దృష్టిలో విలువ లేకపోవటం గమనించి తను కూడా మిగతా మతాల్లాగా మారాలని ప్రయత్నిస్తోంది. భిన్నత్వాన్ని అంగీకరించగలగటమే హిందూమతం యొక్క బలం, అదే దాని బలహీనత కూడా. దాన్ని ఒదులుకుంటే అది తనలోని ఎన్నో బలహీనతలను అధిగమించగలదు. కానీ భిన్నత్వాన్ని అంగీకరించగల దాని స్వభావమే, ఈ దేశ లౌకికత్వనికి రక్ష. అది గమనించకుండా దాని బలహీనతల పైన దాడికి దిగటం ప్రమాదకరం. అటువంటి చేష్టల పర్యవసానమే, అతివాదులకు పెరుగుతున్న ఆదరణ. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనన్న మెసేజ్ జనాల్లోకి వెళ్ళనంత వరకు, వూరికే లౌకికత్వమని, ఇంకోటని గొంతు చించుకుని అరిచినా ఏమీ లాభం ఉండదు.


Friday, April 25, 2008

గ్రంధాలయాలు - నా పుస్తక పఠనం

గ్రంధాలయం అంటే నాకు మొదట గుర్తొచ్చేది మా ఇల్లే. ఇంటి నిండా పుస్తకాలతో అదో చిన్న లైబ్రరీలా వుండేది. మా ఇంట్లో దాదాపు అందరూ పుస్తకాల పురుగులే. ప్రతి వారికి వారి వారి అభిరుచిని బట్టి పుస్తకాల కలెక్షన్ వుండేది. పుస్తకాల మధ్య పెరగటం వల్లనేమో నాకు చదవటం వ్యసనమైపోయింది. నాకు తరగతి పుస్తకాలు చదవాలంటే ఎంత చిరాకో, మిగతా పుస్తకాలు చదవాలంటే అంత ఇష్టం. నా పుస్తక పఠనం చందమామ పుస్తకాలతో మొదలయ్యింది. మా ఇంట్లో చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, రామక్రిష్ణ ప్రభ లాంటివి తెప్పించేవాళ్ళు. అప్పట్లో ప్రతి వేసవి సెలవలకు అమ్మమ్మ వాళ్ళ వూరికి వెళ్ళేవాళ్ళం. అది క్రిష్ణా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడ కొత్త పుస్తకాలు దొరికేవి కాదు. నా బాధ పడలేక మా తాతయ్య బయటికెళ్ళినప్పుడు పక్కనే వున్న వీరంకిలాకు సెంటర్ నుంచి అనుకుంటా కథల పుస్తకాలు తెచ్చేవారు. ఒకసారి పక్కనే మా పిన్ని వాళ్ళ వూరైన అగినిపర్రు వెళ్తే, నా సంగతి విన్న మా బాబాయి నన్ను ఆ వూరు పంచాయితి గ్రంధాలయంలో అప్పచెప్పేసారు. అక్కడ చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పది సంవత్సరాలవి వుండేవి. నేను ఆత్రంగా వాటి మీద పడిపోయి వున్న వారం రోజుల్లో అన్నీ ముగించేసాను. ఎత్తిన పుస్తకం దించకుండా చదివేసి, మళ్ళీ బోర్ అని ఇంట్లో వాళ్ళని విసిగించే నాకు పుస్తకాలు సప్లై చెయ్యటం పెద్ద సమస్య మా ఇంట్లో. నాకోసం వూరంతా గాలించి, తెలిసిన వారందరి ఇళ్ళలోంచి పుస్తకాలు తెప్పించేవారు. అలా రామాయణం, ఉషశ్రీ మహాభారతము, భాగవత కథలు సెలవుల్లో లాగించేసాను. అప్పట్లో కథల పుస్తకాలు పెద్ద వ్యసనం నాకు. ఎంత వ్యసనం అంటే ఎప్పుడూ అవే చదువుతున్నానని మా నాన్న వాటిని అటక మీద దాచేస్తే, పైకి ఎక్కబోయి క్రిందపడి చేయి విరగ్గొట్టుకునేంతగా. చేయి విరిగాక, ఇంట్లో తిట్లు తిన్నాక, ఐదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ తప్పాక, జోరు తగ్గించక తప్పలేదు.

మళ్ళీ తొమ్మిదో తరగతిలో అనుకుంటా, అదే వూపులో చదవటం మొదలెట్టాను. తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర ఒక రీజినల్ లైబ్రరీ ఉండేది. ఖాళీ దొరికినప్పుడు అక్కడికెళ్ళేవాడిని. ఒక టైములో ఫిలాసఫీ మీదకు మళ్ళాను. ఒక యోగి ఆత్మ కథతో మొదలు పెట్టి ఆధ్యాత్మిక పుస్తకాల మీద పడ్డాను. యోగానికి, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలకు ఆ లైబ్రరిలో ఒక ప్రత్యేక సెక్షన్ ఉండేది. రామక్రిష్ణ పరమహంస, వివేకానందుల జీవిత చరిత్రలు అక్కడే చదివాను. ఆ లైబ్రరి చాలా పాతగా దయ్యాల కొంపలా ఉండేది. నేను గుహల్లో నిధి కోసం వెతుకుతున్నట్లు, లోపలెక్కడో చీకట్లో వుండే సెక్షన్లలో పాత పుస్తకాలు చూస్తుండేవాడిని. అలా పాత పుస్తకాలతో స్నేహం చెయ్యటంతో పాటూ, డస్ట్ అలెర్జీతో కూడా స్నేహం చెయ్యాల్సి వచ్చింది. ఇవి కాక ఇంట్లో మా తాతగారి కలెక్షన్ లోంచి రవీంద్రనాథ్ టాగూర్ గోరా, బడా దీది లాంటి బెంగాలి అనువాదాలు, వేమన పద్యాలు, కూనలమ్మ పదాలు, ఇంకా మహాసేనాని లాంటి తెలుగు నవలలు చదివాను. నేను ఇంటర్లోకి వచ్చి ఎంసెట్ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి రావటం, ఆ గ్రంధాలయం మూసెయ్యటం ఒకేసారి జరిగాయి.

ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను. ఈసారి నాకు పుస్తకాలు సరఫరా చేసే బాధ్యత ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా వుండే సెంట్రల్ లైబ్రరీ తీసుకుంది. దేవస్థానం వారు నిర్వహించే ఆ గ్రంధాలయం చాలా పెద్దదిగా, విశాలంగా వుండేది. అప్పుడప్పుడు మధ్యానం పూట ఫాన్ కింద పడుకోటానికి వచ్చే ఒకరిద్దరు తప్ప దాదాపు నిర్మానుష్యంగా వుండేది. అక్కడ సంస్కృత పుస్తకాలకు ఒక ప్రత్యేక సెక్షన్ వుండేది. దాంట్లోనే భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం చూసాను. మొదట్లో కొన్ని రోజులు ఇంగ్లీషు పుస్తకాలతో పొద్దుపుచ్చాను. జీరో బయోగ్రఫీ, స్టోరి ఆఫ్ పై లాంటి పుస్తకాలు అక్కడే చదివాను. అప్పట్లో నాకు చరిత్ర గురించి తెలిసింది బహు తక్కువ. స్కూల్లో వున్నప్పుడు నాకు చరిత్ర అంటే చాలా చిరాకు వుండేది. అసలే జ్ఞాపక శక్తి తక్కువ, ఇక ఆ సంవత్సరాలు అవి గుర్తుపెట్టుకోటం చాలా కష్టంగా వుండేది. ఈ గ్రంధాలయానికి రావటం మొదలుపెట్టాక తెలుగు సెక్షన్లో నాకు ప్రతిసారి తెన్నేటి సూరి రాసిన చెంఘిజ్ ఖాన్ పుస్తకం కనిపించేది. అట్ట మీద చైనీయుడి బొమ్మ చూసి ఆసక్తి రాక వెనక్కి పెట్టేసేవాడిని. ఒకసారి టీవీలో బాలకృష్ణ ఇంటర్వ్యూ వస్తుంటే, దాంట్లో మీరు చెయ్యాలనుకునే డ్రీమ్ రోల్స్ ఏంటంటే, చెంఘిజ్ ఖాన్ పాత్ర చెయ్యాలనుందని చెప్పాడు. చెంఘిజ్ ఖాన్ గురించి ఆంత హీరోయిక్ ఏముందో తెలుసుకోవాలనిపించి, తర్వాత రోజు ఆ పుస్తకం చదివాను. చరిత్ర టెక్స్ట్ బుక్ లాగా కాకుండా కథలా చెప్పటం వల్లనేమో నాకు బాగా నచ్చింది. ఆ తర్వత వరసగా చరిత్ర పుస్తకాల మిద పడిపోయాను. రెండో ప్రపంచ యుద్దం గురించిన పుస్తకాలు, హిట్లర్ ఆత్మ కథ(Mein Kampf) లాంటివి చదివాక, తెలుగు వారి చరిత్ర మీదకు వచ్చాను. కాకతీయులు, విజయనగర రాజుల గురించిన పుస్తకాలు కనిపిస్తే వదిలేవాడిని కాదు. చరిత్రతో పాటూ కొంచం మసాలా కలిపి, కల్పిత పాత్రలతో కథలా చెప్పే రచనలు బాగా ఎక్కేవి నాకు. అటువంటి రచనల్లో అడివి బాపిరాజు రాసిన గోన గన్నారెడ్డి పుస్తకం చాలా ఇష్టమైంది నాకు.

ఇంజనీరింగ్ అయ్యాక మాస్టర్స్ కోసం అరవదేశానికి వెళ్ళాల్సి రావటంతో, సెంట్రల్ లైబ్రరీతో కూడా రుణం తీరింది నాకు. అక్కడేమో హాస్టల్లో ఏం చెయ్యాలో తోచేది కాదు. పరీక్షలప్పుడు తప్ప మామూలు రోజుల్లో తరగతి పుస్తకాలు తాకితే కళ్ళు పోతాయనే నమ్మకం వుండే వాళ్ళవటంతో, మా బ్యాచ్ అంతా ఎప్పుడూ గోళ్ళు కొరుకుతూ ఖాళీగా వుండే వాళ్ళం. కొన్నాళ్ళకు వేళ్ళు నెప్పెట్టి మళ్ళీ తెలుగు పుస్తకాల మీదా పడ్డాను. ఇంటికెళ్ళినప్పుడల్లా తిరుపతిలోని విశాలాంధ్ర బుక్ స్టోర్స్ మీద పడి పుస్తకాలు కొనెయ్యటం మొదలు పెట్టాను. చెంఘిజ్ ఖాన్ పుస్తకం లాగే, నాకు ప్రతిసారి గురజాడ వారి కన్యాశుల్కం కనిపించేది. ఆ పేరు వినగానే నాకు పాత సినిమాల్లో ఏడుపు సీన్లు గుర్తుకొచ్చేవి. ఎప్పటిదో పాత దురాచారం గురించి, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాంలే అనుకొని తెరిచేవాడ్ని కాదు. ఒకసారి టీవీలో కన్యాశుల్కం సినిమా చూసిన తర్వాత తెలిసింది నేను ఎంత పొరబడ్డానో అని. కొనుక్కొచ్చి ఏకబిగిన చదివేసాను. సినిమా కంటే నాటకం ఇంకా బావుంది. నేను ఇప్పటి వరకు చదివిన పుస్తకాల్లో, ఎన్నిసార్లు చదివినా విసుగు రాని పుస్తకం అదేనేమో. అప్పట్నుంచి మనసు తెలుగు సాహిత్యం మీదకు మళ్ళింది. మెల్లగా నా హాస్టల్ రూములో ఒక చిన్నపాటి లైబ్రరీ తయారయ్యింది. గురజాడ, శ్రీశ్రీ, చెలం, తాపీ ధర్మారావు లాంటి వారి రచనలు, ముళ్ళపూడి వారి పుస్తకాలు, బాపూ కార్టూన్లు, పసలపూడి కథలు, మధురాంతకం రాజారాం కథలు, ఇలా కాస్త పేరున్న ప్రతి పుస్తకం విశాలాంధ్ర బుక్ షాపులోంచి నా లైబ్రరీకి చేరిపోయాయి. ఇంకా చేరుతూనే వున్నాయి. మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి నేను సంపాదించుకున్న ఆస్తి, ఈ నా చిన్ని గ్రంధాలయం.


Monday, February 18, 2008

బీహార్ రైల్వే రాజకీయం

ఉత్తర భారత దేశీయులు స్థానికులకు రావలసిన అవకాశాలు చేజిక్కించుకుంటున్నారని నిరసించటం, ఈసారి కన్నడిగుల వంతయ్యింది. ముంబైలో నార్త్ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైందని రాజ్ థాకరే గొడవ మొదలెట్టిన వారంలోనే కర్నాటక రైల్వేలో గ్రూప్ 'D' పోస్టుల భర్తీని కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. ఈ రెక్రూట్‍మెంట్లు కన్నడిగులకు రావలసిన ఉద్యోగాలు బీహారీలకు కట్టబెట్టటానికే జరుగుతున్నాయని వారి అభియోగం.

క్రితం నెలలో సౌత్ వెస్ట్ రైల్వేలో గ్రూప్ 'D' పోస్టుల కోసం నిర్వహించిన ఫిజికల్ పరీక్షలను, 'కర్నాటక రక్షణ వేదిక' జరగకుండా అడ్డుకుంది. పోయిన వారం చిత్రదుర్గలో సమావేశానికి వచ్చిన లాలూ ప్రశాద్ యాదవ్ ముందు ఈ వేదిక నల్ల జెండాలతో తన నిరసన వ్యక్తం చేసింది. దానికి లాలూ జవాబిస్తూ అందరితో పాటూ మెరిట్‍లో ఆ పొస్టులు దక్కించుకోవాలని, స్థానికులకు రిజర్వేషనులు కుదరదని చెప్పారు. దాదాపు కర్నాటకలోనే రైళ్ళు నడిపే సౌత్-వెస్ట్ రైల్వేలో పోస్టులకు, కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ వార్తా పత్రికల్లో మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. స్థానిక కన్నడ పత్రికలలో ఈ ప్రకటన రాలేదు. ఇక స్థానికులు మెరిట్‍లో తెచ్చుకోవటం ఎలాగో నాకు అర్ధం కావట్లేదు. అసలు సమానంగా అవకాశం కల్పిస్తే కదా మెరిట్‍తో తెచ్చుకోవటమూ, లేకపోవటమూ. ఈసారి ఈ పరీక్షకు హాజరైన వాళ్ళలో స్థానిక కన్నడిగులు 10 శాతం కంటే తక్కువ. వచ్చిన వారిలో బీహారీలే అత్యధికం. కర్నాటకలో రైల్వే పోస్టులు భర్తీ చెయ్యటం కోసం ఎక్కడో బీహార్ నుంచి బెంగుళూరు, మైసూరు, హుబ్లీలకు రైళ్ళలో అభ్యర్ధుల్ని దింపారు. ఇప్పటికే హుబ్లీలాంటి చోట 80 శాతం రైల్వే ఉద్యోగాలలో బీహారీలే వున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ పోస్టులకు ఎంపిక చేయబడుతున్న వారిలో బీహారీలే అత్యధిక శాతం. మరి స్థానికులకు కడుపు మండకుండా ఎలా వుంటుంది. ఈ గ్రూప్ 'డి' పోస్టులకు( పోర్టర్లు, లైన్‍మెన్ మొదలైనవి) అర్హత కేవలం 8వ తరగతి చదివి వుండటం. వీటిని మెరిట్‍లో దక్కించుకునే పాటి తెలివితేటలు కూడా ఇక్కడి స్థానికులకు లేవని నేను అనుకోను.

కర్నాటకే కాదు, ఆంధ్రాలోనూ రైల్వేలో ఎక్కడ పడితే అక్కడ ఈ బీహారీలే వుంటారు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వుంటే అక్కడికి హిందీ మాట్లాడే జనాలు పెద్ద సంఖ్యలో దిగబడిపోతారు. ఇక బీహారీలకైతే అవకాశాలున్న చోటికి ప్రత్యేక రైళ్ళు నడపబడుతాయి. ఈ హిందీ వాళ్ళ ఆటలు దక్షిణాది రాష్ట్రాల్లో (తమిళనాడు మినహాయించి) సాగినంతగా మిగతా రాష్ట్రాల్లో సాగవేమో. ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికైనా మిగతా రాష్టాల వారు పరీక్షకి కూర్చోలేరు. పరీక్ష రోజు రైలు దిగీ దిగగానే, కొట్టి మరీ అదే రైల్లో వెనక్కి పంపిస్తారు కళింగసేన కార్యకర్తలు. మళ్ళీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిండా వీళ్ళే వుంటారు. రాజ్యాంగం భారతీయిలందరికి దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకునే హక్కుని ప్రసాదించిందని గొంతు చించుకునే జాతీయవాదులెవరైనా ఒక్కసారి ఒరిస్సాలోనో, బీహార్లోనో ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది. వాళ్ళ భ్రమలు రైల్వే స్టేషన్‍లోనే తొలగిపోతాయి.

కర్నాటకలో భర్తీ చేసే గ్రూప్ 'డి' పోస్టులాంటి క్రింది స్థాయి ఉద్యోగాలను, కన్నడిగులకు రిజర్వ్ చేయాలని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. కన్నడిగుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే ఈ వేదిక ఇతర డిమాండ్ల గూర్చి నాకు పూర్తిగా తెలీదు కాని, ఇది మాత్రం నాకు సమంజసంగానే అనిపిస్తోంది. పెద్ద పోస్టులకు ఎక్కువ అర్హతలు వుండాలి కాని, గ్రూప్ 'డి' పోస్టుల్లో పని చేసే వారికి ఇంగ్లీష్/హిందీ రావలసిన అవసరం ఏముంది?

రైల్వే ఏదో లాలూ గుత్త సొతైనట్లు బీహారీలకే ఉద్యోగాలిస్తుంటే, ఏమని అడిగే దమ్ము లేదు మన దిక్కుమాలిన పాలకులకు. కర్నాటకలో పాలకులు ఎలా వున్నా, తమ భాష వారికి అన్యాయం జరిగితే నిలదీయటానికి ఒక వేదికైనా వుంది. మనకు అదీ లేదు.