Friday, April 25, 2008

గ్రంధాలయాలు - నా పుస్తక పఠనం

గ్రంధాలయం అంటే నాకు మొదట గుర్తొచ్చేది మా ఇల్లే. ఇంటి నిండా పుస్తకాలతో అదో చిన్న లైబ్రరీలా వుండేది. మా ఇంట్లో దాదాపు అందరూ పుస్తకాల పురుగులే. ప్రతి వారికి వారి వారి అభిరుచిని బట్టి పుస్తకాల కలెక్షన్ వుండేది. పుస్తకాల మధ్య పెరగటం వల్లనేమో నాకు చదవటం వ్యసనమైపోయింది. నాకు తరగతి పుస్తకాలు చదవాలంటే ఎంత చిరాకో, మిగతా పుస్తకాలు చదవాలంటే అంత ఇష్టం. నా పుస్తక పఠనం చందమామ పుస్తకాలతో మొదలయ్యింది. మా ఇంట్లో చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, రామక్రిష్ణ ప్రభ లాంటివి తెప్పించేవాళ్ళు. అప్పట్లో ప్రతి వేసవి సెలవలకు అమ్మమ్మ వాళ్ళ వూరికి వెళ్ళేవాళ్ళం. అది క్రిష్ణా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడ కొత్త పుస్తకాలు దొరికేవి కాదు. నా బాధ పడలేక మా తాతయ్య బయటికెళ్ళినప్పుడు పక్కనే వున్న వీరంకిలాకు సెంటర్ నుంచి అనుకుంటా కథల పుస్తకాలు తెచ్చేవారు. ఒకసారి పక్కనే మా పిన్ని వాళ్ళ వూరైన అగినిపర్రు వెళ్తే, నా సంగతి విన్న మా బాబాయి నన్ను ఆ వూరు పంచాయితి గ్రంధాలయంలో అప్పచెప్పేసారు. అక్కడ చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పది సంవత్సరాలవి వుండేవి. నేను ఆత్రంగా వాటి మీద పడిపోయి వున్న వారం రోజుల్లో అన్నీ ముగించేసాను. ఎత్తిన పుస్తకం దించకుండా చదివేసి, మళ్ళీ బోర్ అని ఇంట్లో వాళ్ళని విసిగించే నాకు పుస్తకాలు సప్లై చెయ్యటం పెద్ద సమస్య మా ఇంట్లో. నాకోసం వూరంతా గాలించి, తెలిసిన వారందరి ఇళ్ళలోంచి పుస్తకాలు తెప్పించేవారు. అలా రామాయణం, ఉషశ్రీ మహాభారతము, భాగవత కథలు సెలవుల్లో లాగించేసాను. అప్పట్లో కథల పుస్తకాలు పెద్ద వ్యసనం నాకు. ఎంత వ్యసనం అంటే ఎప్పుడూ అవే చదువుతున్నానని మా నాన్న వాటిని అటక మీద దాచేస్తే, పైకి ఎక్కబోయి క్రిందపడి చేయి విరగ్గొట్టుకునేంతగా. చేయి విరిగాక, ఇంట్లో తిట్లు తిన్నాక, ఐదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ తప్పాక, జోరు తగ్గించక తప్పలేదు.

మళ్ళీ తొమ్మిదో తరగతిలో అనుకుంటా, అదే వూపులో చదవటం మొదలెట్టాను. తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర ఒక రీజినల్ లైబ్రరీ ఉండేది. ఖాళీ దొరికినప్పుడు అక్కడికెళ్ళేవాడిని. ఒక టైములో ఫిలాసఫీ మీదకు మళ్ళాను. ఒక యోగి ఆత్మ కథతో మొదలు పెట్టి ఆధ్యాత్మిక పుస్తకాల మీద పడ్డాను. యోగానికి, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలకు ఆ లైబ్రరిలో ఒక ప్రత్యేక సెక్షన్ ఉండేది. రామక్రిష్ణ పరమహంస, వివేకానందుల జీవిత చరిత్రలు అక్కడే చదివాను. ఆ లైబ్రరి చాలా పాతగా దయ్యాల కొంపలా ఉండేది. నేను గుహల్లో నిధి కోసం వెతుకుతున్నట్లు, లోపలెక్కడో చీకట్లో వుండే సెక్షన్లలో పాత పుస్తకాలు చూస్తుండేవాడిని. అలా పాత పుస్తకాలతో స్నేహం చెయ్యటంతో పాటూ, డస్ట్ అలెర్జీతో కూడా స్నేహం చెయ్యాల్సి వచ్చింది. ఇవి కాక ఇంట్లో మా తాతగారి కలెక్షన్ లోంచి రవీంద్రనాథ్ టాగూర్ గోరా, బడా దీది లాంటి బెంగాలి అనువాదాలు, వేమన పద్యాలు, కూనలమ్మ పదాలు, ఇంకా మహాసేనాని లాంటి తెలుగు నవలలు చదివాను. నేను ఇంటర్లోకి వచ్చి ఎంసెట్ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి రావటం, ఆ గ్రంధాలయం మూసెయ్యటం ఒకేసారి జరిగాయి.

ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను. ఈసారి నాకు పుస్తకాలు సరఫరా చేసే బాధ్యత ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా వుండే సెంట్రల్ లైబ్రరీ తీసుకుంది. దేవస్థానం వారు నిర్వహించే ఆ గ్రంధాలయం చాలా పెద్దదిగా, విశాలంగా వుండేది. అప్పుడప్పుడు మధ్యానం పూట ఫాన్ కింద పడుకోటానికి వచ్చే ఒకరిద్దరు తప్ప దాదాపు నిర్మానుష్యంగా వుండేది. అక్కడ సంస్కృత పుస్తకాలకు ఒక ప్రత్యేక సెక్షన్ వుండేది. దాంట్లోనే భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం చూసాను. మొదట్లో కొన్ని రోజులు ఇంగ్లీషు పుస్తకాలతో పొద్దుపుచ్చాను. జీరో బయోగ్రఫీ, స్టోరి ఆఫ్ పై లాంటి పుస్తకాలు అక్కడే చదివాను. అప్పట్లో నాకు చరిత్ర గురించి తెలిసింది బహు తక్కువ. స్కూల్లో వున్నప్పుడు నాకు చరిత్ర అంటే చాలా చిరాకు వుండేది. అసలే జ్ఞాపక శక్తి తక్కువ, ఇక ఆ సంవత్సరాలు అవి గుర్తుపెట్టుకోటం చాలా కష్టంగా వుండేది. ఈ గ్రంధాలయానికి రావటం మొదలుపెట్టాక తెలుగు సెక్షన్లో నాకు ప్రతిసారి తెన్నేటి సూరి రాసిన చెంఘిజ్ ఖాన్ పుస్తకం కనిపించేది. అట్ట మీద చైనీయుడి బొమ్మ చూసి ఆసక్తి రాక వెనక్కి పెట్టేసేవాడిని. ఒకసారి టీవీలో బాలకృష్ణ ఇంటర్వ్యూ వస్తుంటే, దాంట్లో మీరు చెయ్యాలనుకునే డ్రీమ్ రోల్స్ ఏంటంటే, చెంఘిజ్ ఖాన్ పాత్ర చెయ్యాలనుందని చెప్పాడు. చెంఘిజ్ ఖాన్ గురించి ఆంత హీరోయిక్ ఏముందో తెలుసుకోవాలనిపించి, తర్వాత రోజు ఆ పుస్తకం చదివాను. చరిత్ర టెక్స్ట్ బుక్ లాగా కాకుండా కథలా చెప్పటం వల్లనేమో నాకు బాగా నచ్చింది. ఆ తర్వత వరసగా చరిత్ర పుస్తకాల మిద పడిపోయాను. రెండో ప్రపంచ యుద్దం గురించిన పుస్తకాలు, హిట్లర్ ఆత్మ కథ(Mein Kampf) లాంటివి చదివాక, తెలుగు వారి చరిత్ర మీదకు వచ్చాను. కాకతీయులు, విజయనగర రాజుల గురించిన పుస్తకాలు కనిపిస్తే వదిలేవాడిని కాదు. చరిత్రతో పాటూ కొంచం మసాలా కలిపి, కల్పిత పాత్రలతో కథలా చెప్పే రచనలు బాగా ఎక్కేవి నాకు. అటువంటి రచనల్లో అడివి బాపిరాజు రాసిన గోన గన్నారెడ్డి పుస్తకం చాలా ఇష్టమైంది నాకు.

ఇంజనీరింగ్ అయ్యాక మాస్టర్స్ కోసం అరవదేశానికి వెళ్ళాల్సి రావటంతో, సెంట్రల్ లైబ్రరీతో కూడా రుణం తీరింది నాకు. అక్కడేమో హాస్టల్లో ఏం చెయ్యాలో తోచేది కాదు. పరీక్షలప్పుడు తప్ప మామూలు రోజుల్లో తరగతి పుస్తకాలు తాకితే కళ్ళు పోతాయనే నమ్మకం వుండే వాళ్ళవటంతో, మా బ్యాచ్ అంతా ఎప్పుడూ గోళ్ళు కొరుకుతూ ఖాళీగా వుండే వాళ్ళం. కొన్నాళ్ళకు వేళ్ళు నెప్పెట్టి మళ్ళీ తెలుగు పుస్తకాల మీదా పడ్డాను. ఇంటికెళ్ళినప్పుడల్లా తిరుపతిలోని విశాలాంధ్ర బుక్ స్టోర్స్ మీద పడి పుస్తకాలు కొనెయ్యటం మొదలు పెట్టాను. చెంఘిజ్ ఖాన్ పుస్తకం లాగే, నాకు ప్రతిసారి గురజాడ వారి కన్యాశుల్కం కనిపించేది. ఆ పేరు వినగానే నాకు పాత సినిమాల్లో ఏడుపు సీన్లు గుర్తుకొచ్చేవి. ఎప్పటిదో పాత దురాచారం గురించి, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాంలే అనుకొని తెరిచేవాడ్ని కాదు. ఒకసారి టీవీలో కన్యాశుల్కం సినిమా చూసిన తర్వాత తెలిసింది నేను ఎంత పొరబడ్డానో అని. కొనుక్కొచ్చి ఏకబిగిన చదివేసాను. సినిమా కంటే నాటకం ఇంకా బావుంది. నేను ఇప్పటి వరకు చదివిన పుస్తకాల్లో, ఎన్నిసార్లు చదివినా విసుగు రాని పుస్తకం అదేనేమో. అప్పట్నుంచి మనసు తెలుగు సాహిత్యం మీదకు మళ్ళింది. మెల్లగా నా హాస్టల్ రూములో ఒక చిన్నపాటి లైబ్రరీ తయారయ్యింది. గురజాడ, శ్రీశ్రీ, చెలం, తాపీ ధర్మారావు లాంటి వారి రచనలు, ముళ్ళపూడి వారి పుస్తకాలు, బాపూ కార్టూన్లు, పసలపూడి కథలు, మధురాంతకం రాజారాం కథలు, ఇలా కాస్త పేరున్న ప్రతి పుస్తకం విశాలాంధ్ర బుక్ షాపులోంచి నా లైబ్రరీకి చేరిపోయాయి. ఇంకా చేరుతూనే వున్నాయి. మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి నేను సంపాదించుకున్న ఆస్తి, ఈ నా చిన్ని గ్రంధాలయం.